అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడైన టారిఫ్ విధానాన్ని సమర్థించుకుంటూ సంచలన ప్రకటన చేశారు. తన ప్రభుత్వం టారిఫ్ పన్నుల ద్వారా వసూలు చేస్తున్న ఆదాయం నుంచి త్వరలోనే ప్రతి అమెరికన్కు కనీసం 2వేల డాలర్ల చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, అధిక ఆదాయం ఉన్న సంపన్నులకు ఈ పథకం వర్తించదని ఆయన స్పష్టం చేశారు. తన టారిఫ్ విధానాన్ని విమర్శిస్తున్న వారిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టారిఫ్లను వ్యతిరేకించేవాళ్లు మూర్ఖులు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తన హయాంలోనే అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న, గౌరవనీయమైన దేశంగా మారిందని, ద్రవ్యోల్బణం దాదాపు లేదని, స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

టారిఫ్ పన్నుల ద్వారా దేశానికి ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం వస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిధులతో 37 ట్రిలియన్ డాలర్ల జాతీయ రుణాన్ని తగ్గించడం ప్రారంభిస్తామని తెలిపారు. అదే సమయంలో ప్రజలకు డివిడెండ్ రూపంలో ఈ నగదును అందిస్తామని వివరించారు. అయితే, ఈ 2వేల డాలర్ల డివిడెండ్ను ప్రజలకు ఎలా పంపిణీ చేస్తారు? ఎప్పటి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది? వంటి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.















