అమెరికాలోని డెట్రాయిట్లో అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ( ఏపీటీఏ -ఆప్త) ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహ వర్క్షాప్ నిర్వహించారు. భక్తితో పాటు ప్రకృతిని కాపాడే సందేశంతో మేబరీ పార్క్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. మట్టితో వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేసుకోవడాన్ని నేర్చుకున్నారు. ఆప్త అధ్యక్షుడు మధు ఉల్లి మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ కోసం భారత్ నుంచి ప్రత్యేకంగా వినాయక విగ్రహ మౌల్డ్స్ను తెప్పించామని తెలిపారు. పిల్లలు తమ చేతులతో విగ్రహాలను తయారు చేసుకోవడం ద్వారా భారతీయ సంస్కృతి పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వ్యవహరించిన వెంకట్ యనుముల ( బోర్డు మాజీ డైరెక్టర్), మిచిగాన్ స్టేట్ కో ఆర్డినేటర్ జి.కిశోర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని ఈతరం పిల్లలకు అందించడమే కాకుండా, పర్యావరణాని కి మేలు చేసే మట్టి విగ్రహాలను తయారు చేయడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు తోడ్పడటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భారతీయ సంప్రదాయ పండుగలను విదేశాల్లోనూ అదే ఉత్సాహంతో నిర్వహించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. డెట్రాయిట్లో విజయవంతంగా నిర్వహించిన ఈ వర్క్షాప్ త్వరలోనే అమెరికాలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
















