సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం జాక్-కొంచెం క్రాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. వైష్ణవి చైతన్య కథానాయిక. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్కేర్ తర్వాత ఎలాంటి కథలు చేయాలని చాలా ఆలోచించాను. అదే మీటర్లో ఉండాలి కానీ, కథ మాత్రం కొత్తగా అనిపించాలనుకున్నా. జాక్ కథ వినగానే టిల్లు స్కేర్ తర్వాత ఇదే పర్ఫెక్ట్ సినిమా అనిపించింది అన్నారు. జాక్ కోసం మంచి టీమ్తో పనిచేయడం ఆనందంగా ఉందని, టిల్లు సిరీస్లో వచ్చిన చిత్రాలతో తనకు ఓ కామెడీ టైమింగ్ కుదిరిందని, దానిని జాక్ లో మిస్ అవకుండా చూసుకున్నానని తెలిపారు.

సిద్ధులో ఉన్న స్పార్క్ని ఎప్పుడో కనిపెట్టాను. అది ఈ సినిమాలో వైల్డ్ఫైర్లా ఉంటుంది. కథానాయిక వైష్ణవి చైతన్య ప్రతీ సీన్లో అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు అని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ పేర్కొన్నారు. సినిమా విజయంపై టీమ్ అంతా పూర్తి నమ్మకంతో ఉన్నామని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ చెప్పారు. టిల్లు కంటే రెండింతల వినోదంతో ప్రేక్షకుల్ని సిద్ధు ఎంటర్టైన్ చేస్తారని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
