బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఐతే, వినాయక చవితి పర్వదినం సందర్భంగా, నిర్మాతలు సీతారాములు ఏకాంతంగా ఉన్నట్లుగా చిత్రీకరించిన మొదటి పోస్టర్ను విడుదల చేశారు. చిత్ర బృందం రూపొందిస్తున్న అద్భుతమైన ప్రపంచానికి ఈ 30 సెకన్ల వీడియో ఒక చిన్న ట్రీట్ మాత్రమే. సినిమాలో విజువల్స్ ఇంకా అద్భుతంగా ఉండబోతున్నాయి.

బాలీవుడ్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా విదేశీ నిపుణులు పని చేస్తున్నారు. పైగా సరికొత్త టెక్నాలజీ, భారీ సెట్స్తో ఇండియా మరియు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, తొలి భాగాన్ని 2026 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.















