సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం గ్యాంబ్లర్స్. ప్రశాంతి చారులింగా కథానాయిక. కేఎస్కే చైతన్య దర్శకుడు. సునీత, రాజ్కుమార్ బృందావనం నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా, ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. నిర్మాతల్లో ఒకరైన రాజ్కుమార్ బృందావనం మాట్లాడుతూ వైవిధ్యమైన కాన్సెప్ట్తో ఈ సినిమా నిర్మించాం. అన్ని వర్గాలను అలరించే అంశాలు ఇందులో ఉంటాయి అని తెలిపారు.

అన్ని ఎమోషన్సూ ఉన్న యూత్ఫుల్ ఎంటైర్టెనర్ ఇదని, ఇందులో నటుడిగా సంగీత్ శోభన్లోని కొత్త కోణాన్ని చూస్తారని, ప్రతి అంశం థ్రిల్లింగ్గా ఉంటుందని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నైజం విడుదల చేస్తున్నదని మరో నిర్మాత సునీత చెప్పారు. గ్లామర్, కామెడీ, మిస్టరీ కలబోతగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు కేఎస్కే తెలిపారు. రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్న, సాయిశ్వేత, జస్విక, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్ సాగర్, సంగీతం: శశాంక్ తిరుపతి.
