లక్ష్ చదలవాడ, వేదిక దత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్స్టర్ గంగరాజు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఈనెల 24న విడుదలవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. హీరో లక్ష్ మాట్లాడుతూ మంచి కంటెంట్తో వస్తున్న చిత్రమిది. యూనిట్ అంతా సొంత సినిమా అనుకుని శ్రమించారు. మీకు తప్పకుండా నచ్చుతుంది. మనమంతా థియేటర్స్లో సినిమాను చూసి ఎంజాయ్ చేసిన వాళ్లం. ఈ చిత్రాన్నీ అలాగే ఆస్వాదిస్తారు అన్నారు. అనంతరం చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ నా దృష్టిలో నిర్మాతలే హీరోలు. అందుకే నా గ్యాంగ్స్టర్ గంగరాజు ప్రీ రిలీజ్ ఫంక్షన్కు నిర్మాతలను ఆహ్వానించాను. ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు. ఒక పెద్ద సినిమా తీసే బడ్జెట్లో 25 చిన్న సినిమాలు తీయొచ్చు. అందుకే కొత్త వారిలో మా బ్యానర్లో 15 సినిమాలు చేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు నిర్మాతలు కేఎస్ రామారావు, సి కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.














