ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మరియు తిరుపతి సిటీ చాంబర్ సంయుక్త నిర్వహణలో డిసెంబరు 4వ తేదీన తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో “తానా పుస్తక మహోద్యమం” ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయిన తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారు మాట్లాడుతూ “తెలుగు పుస్తకాలను కొని, బహుమతులుగా అందించి, పుస్తకాలను చదివే సంస్కృతిని ప్రోత్సహించడానికి సాహిత్య చరిత్రలోనే అపూర్వంగా “తానా పుస్తక మహోద్యమం” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారి సారధ్యంలో ఈ ఉద్యమం జరుగుతుంది. జ్ఞానాన్ని పొందడానికి, మనో వికాసం జరగటానికి, వ్యక్తిత్వం రూపుదిద్దుకోవటానికి, విజయపథంలో పయనించడానికి పుస్తక పఠనం ప్రధానం. అందుకే అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని” వారు పిలుపునిచ్చారు.
“తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడం కోసం, మానవ వికాసం కోసం ఉపయుక్తమయ్యే పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడానికి ఈ విధంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్న తానా సంస్థ వారికి ధన్యవాదాలు. అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి” అని యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కె. రాజారెడ్డి గారు అన్నారు.
వేదిక సమన్వయకర్త, శత శతక కర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ “తెలుగు భాష సాహిత్యాలను పరిపుష్టం చేసుకోవడం కోసం, పుస్తకాలు కొని చదివే సంస్కృతిని ప్రోత్సహించటం ఒక మంచి మార్గం. పుస్తకాలు కొని చదివే వారు ఉంటేనే కవులు, రచయితలు మరింత ఉత్సాహంగా రచనలు చేయగలరని అందుకే ఈ ఉద్యమాన్ని తల పెట్టాము” అన్నారు. తదనంతరం తెలుగు పుస్తకాలను వివిధ కళాశాలల విద్యార్థులకు అతిథులు బహుమతులు గా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు శ్రీ మోహన్ ఈదర యు. ఎస్.ఎ. తుడా- తిరుపతి ఉపాధ్యక్షులు శ్రీ సూర్యదేవర హరికృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీహరి, పత్రికా సంపాదకులు శ్రీ ఏ. గిరిధర్, శ్రీ ఆయుబ్ ఖాన్, శ్రీ వై. షణ్ముగం, శ్రీ హరి, శ్రీ గిరి,శ్రీ శివ విద్యావేత్త శ్రీ వాసు తదితరులు పాల్గొన్నారు.