
ఆది సాయికుమార్ హీరోగా, అర్చన అయ్యర్ కథానాయికగా నటించిన చిత్రం శంబాల. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా అర్చన అయ్యర్ మీడియాతో మాట్లాడారు. శంబాల ప్రీమియర్లను చూసిన వారంతా తాను పోషించిన దేవి పాత్రను చూసి షాక్ అవుతున్నారని, ప్రేక్షకులందరూ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతికిలోనవుతున్నారని చెప్పింది. తాను అచ్చమైన తెలుగమ్మాయినని, పుట్టింది చిత్తూరులో, విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులో జరిగిందని చెప్పింది. శంబాల చిత్రంలో నేను దేవి అనే పాత్రలో కనిపిస్తా. ఎన్నో సవాళ్లతో కూడుకున్న పాత్ర అది. ప్రీమియర్స్ చూసిన చాలా మంది నన్ను అభినందిస్తున్నారు. ఇలాంటి సినిమాల్ని థియేటర్లో చూస్తేనే థ్రిల్. నా కెరీర్లో దేవిలాంటి పాత్ర మళ్లీ రాదనుకుంటున్నా. మంచి కథల్ని ఎంచుకుంటూ ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుంది అని చెప్పింది.















