Namaste NRI

ఇళయరాజా మ్యాజిక్‌.. షష్టిపూర్తి నుంచి మరో మెలోడీ సాంగ్ లాంచ్

ప్రేమ, రక్తబంధాల నేపథ్యంలో రూపొందిన కుటుంబకథా చిత్రం షష్టిపూర్తి. నాటి లేడీస్‌టైలర్‌ జంట రాజేంద్ర ప్రసాద్‌, అర్చన ఇందులో కీలక పాత్రలు పోషించారు. రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ హీరోహీరోయిన్లు. పవన్‌ప్రభ దర్శకత్వంలో రూపేష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్‌ వేగవంతం చేశారు. ఇళయరాజా స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కథానుగుణంగా షష్టిపూర్తి రోజు వచ్చే గీతాన్ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. వేయి వేణువులనాదం మోగే హాయి హాయి హృదయాన.. ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన.. సరదాలే సరిగమలై పలికిన శుభవేళ.. అరవైలో ఇరవైలా విరిసిన వరమాల అంటూ సాగే ఈ పాటను చైతన్యప్రసాద్‌ రాయగా, కార్తీక్‌, విభావరి ఆప్టే జోషి కలిసి ఆలపించారు.

స్వర్ణ మాస్టర్‌ ఈ గీతానికి నృత్య రీతుల్ని సమకూర్చారు. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు హైలైట్‌ కానున్నదని, ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్నా ఈ పాటను ప్లే చేసి తీరాల్సిందేనని, ఈ పాటకోసం లెజెండ్రీ కళాదర్శకుడు తోటతరణి నిర్మించిన మండువ లోగిలి సెట్‌ అద్భుతమైన అనుభూతికి లోను చేస్తుందని, రాజేంద్రప్రసాద్‌, అర్చన, రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌లపై చిత్రీకరించిన ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానున్నదని మేకర్స్‌ తెలిపారు. ‘కాంతార’ఫేం అచ్యుత్‌కుమార్‌, సంజయ్‌ స్వరూప్‌, తెనాలి శకుంతల, మురళీధర్‌గౌడ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రామ్‌, నిర్మాణం: మా ఆయి ప్రొడక్షన్స్‌.

Social Share Spread Message

Latest News