భారత్, పాకిస్తాన్ మధ్య నిర్మాణాత్మక చర్చలు, అర్ధవంతమైన సంప్రదింపులు జరిగేందుకు అమెరికా మద్దతిస్తుందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. చర్చల ప్రక్రియపై భారత్, పాకిస్తాన్లే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రైస్ స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను చర్చల ద్వారా ఇరుదేశాలు పరిష్కరించుకునేలా సంప్రదింపులకు అమెరికా మద్దతిస్తుందని అన్నారు. ఏరూపంలోనైనా భారత్-పాకిస్తాన్ మధ్య చర్చల ప్రక్రియకు తాము బాసటగా నిలుస్తామని తేల్చిచెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల కోసం తాము మధ్యవర్తిత్వం వహించబోమని ప్రైస్ పేర్కొన్నారు. చర్చల ప్రక్రియకు ఇరు దేశాలు సమ్మతించి ముందుకొస్తే ఇరు దేశాల భాగస్వామిగా తమ వంతు పాత్ర పోషించేందుకు బాధ్యతతో వ్యవహరిస్తామని తెలిపారు. చర్చల ప్రక్రియకు విధివిధానాల్లో అమెరికా పాత్ర ఉండబోదని అన్నారు.
