భారతీయుల ప్రతిభ అపారమని, అమెరికాలోని ప్రతి రంగంలోనూ వారి ఉనికి ఉందని, రెండు దేశాల సంబంధాలకు వారధిలా పని చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించారు. కేవలం స్పెల్ బీలోనే కాదు, టెక్నాలజీ నుంచి అంతరిక్షం దాకా ప్రతి రంగంలోనూ వారి పాత్ర ఉంది. వారు తమ ప్రజ్ఞాపాటవాలతో రెండు దేశాల ప్రేమను గెలుచుకున్నారు. మనల్ని కలిపారు. సత్సంబంధాల ద్వారాలను తెలిచారు. మన బంధానికి ఉన్న విస్తృతిని తెలియజేశారు అని తెలిపారు. బైడెన్తో భేటీ తరువాత కేపిటల్ భవనానికి వచ్చిన మోదీని స్పీకర్ మెకార్థి ఘనంగా స్వాగతించి సభలోకి తోడ్కొని వెళ్లారు. వేదికపై ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, స్పీకర్ మెకార్థి ఆసీనులుకాగా భారీగా హాజరైన చట్టసభ సభ్యులనుద్దేశించి ప్రధాని గంటపాటు ఆంగ్లంలో ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి పలుమార్లు సభ్యులు చప్పట్లతో మద్దతు తెలిపారు. సందర్శకుల గ్యాలరీల్లో ఉన్నవారు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.
140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ సభలో మాట్లాడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రెండుసార్లు ఇక్కడ ప్రసంగించే అవకాశం రావడం అసాధారణ అదృష్టమని అనుకుంటున్నా. సముద్రాలు, అంతరిక్షం, సైన్స్, సెమీ కండర్టర్లు, స్టార్టప్లు, టెక్నాలజీ, వాణిజ్యం, వ్యవసాయం, ఆర్థికం కళలు, కృత్రిమ మేధ, విద్య, ఎనర్జీ, ఆరోగ్యం సుస్థిరాభివృద్ధిలలో ఇప్పుడు అమెరికా, భారత్ కలిసి పని చేస్తున్నాయి అని తెలిపారు. గతంలో 2016లో ప్రధాని ఒకసారి సంయుక్త సమావేశంలో మాట్లాడారు. దీంతో రెండుసార్లు అమెరికా చట్టసభలో ప్రసంగించిన భారత నేతగా మోదీ రికార్డు సృష్టించారు.