సూర్య హీరోగా నటిస్తూ, జ్యోతిక, కార్తికేయన్ సంతానంలతో కలిసి నిర్మించిన పాన్ ఇండియా చిత్రం రెట్రో. పూజా హెగ్డే కథానాయిక. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. మే 1న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రతిష్టాత్మక సితార ఎంటైర్టెన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది. హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడారు. రెట్రో పూర్తిగా డైరెక్టర్ సినిమా. కార్తీక్ సుబ్బరాజ్ కొత్త జానర్లో సినిమా తీశాడు. తప్పకుండా ఆడియన్స్కి కొత్త అనుభూతినిస్తుంది. సంతోష్ నారాయణ్ అద్భుతమైన పాటలిచ్చారు. ప్రకాష్రాజ్, నాజర్, జోజూ జార్జ్ ఇలా గొప్ప నటులు ఇందులో భాగం అయ్యారు. త్వరలో సితార ఎంటైర్టెన్మెంట్స్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. ఆ వివరాలు త్వరలో చెప్తాం. మే1న రెట్రో రాబోతుంది. అలాగే నాని హిట్-3 కూడా అదేరోజు రానుంది.రెండూ బాగా ఆడాలి. అలాగే త్వరలో రాబోతున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ పెద్ద హిట్ కావాలి అని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దేవరకొండ విజయ్ మాట్లాడుతూ నా 10th టైమ్లో గజనీ చూశా. సూర్య అన్నని చూడ్డం అదే ఫస్ట్. అప్పట్నుంచే ఆయనపై లవ్ మొదలైంది. పితామగన్, కాకా, సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఇలా అయన సినిమాల్నీ చూశా. నా 20ఏండ్ల వయసులో ఆయన్ను కలవాలని గట్టిగా అనుకున్నా. పదిహేనేళ్ల తర్వాత ఆయనతో ఈ మూమెంట్ని షేర్ చేసుకునే అవకాశం దక్కింది. సూర్యలా విభిన్నమైన జానర్లు చేయడానికి, ప్రయోగాత్మక పాత్రలు పోషించడానికి చాలా దైర్యం కావాలి. రైట్రో తో కచ్చితంగా ఓ అద్భుతమైన షో చూపించనున్నారు అన్నారు.

ఈ మూమెంట్ నాకెంతో స్పెషల్. పెళ్లిచూపులు, అర్జున్రెడ్డి తర్వాత నేను కూడా కాస్త డబ్బులు చూడ్డం మొదలుపెట్టా. దాంతో పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏమైనా చేయాలనే కోరిక ఉండేది. కానీ సూర్య అన్న అగరం ఫౌండేషన్ ద్వారా వేలాదిమంది పిల్లల్ని చదివిస్తున్నారు. నేను కూడా ఆయన దారిలో కొందరినైనా చదివిద్దామనుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్ వెంకీ అట్లూరి, యాక్టర్ కరుణాకరన్, గీత రచయిత కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.
