రష్యా నుంచి చమురు కొనుగోలు కారణం చూపి భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు (50 శాతం) విధించిన విషయం తెలిసిందే. భారత్-అమెరికా మధ్య రష్యా చమురు దిగుమతులపై ఏర్పడిన ఉద్రిక్తతల నడుమ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ -రష్యా సంబంధాలపై మరింత సృజనాత్మకంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలను ఆహ్వానించారు.

మాస్కోలో జరిగిన భారత్–రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్తో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవడంతోపాటు వివిధ అంశాల్లో సహకరించుకోవాలని ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి సూచించారు. ఎక్కువ చేయాలి, భిన్నంగా చేయాలి అన్నదే ఇరు దేశాల వాణిజ్యమంత్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
















