
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82) కన్నుమూశారు.ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కావూరి సాంబశివరావుకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆయన ఇప్పటివరకూ ఐదుసార్లు ఎంపీగా పనిచేశారు. 1984, 1989, 1998లో మచిలీపట్నం నుంచి, 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికైన కావూరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2013లో కేంద్ర జౌళిశాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. కావూరికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం, బ్యాంకుల అప్పుల వ్యవహారాల్లో చిక్కుకోవడం, ఆ తర్వాత బీజేపీలో చేరిపోవడం జరిగాయి. అనారోగ్యంతో ఆయన కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు.















