దేశం నుంచి బహిష్కరిస్తున్న ప్రవాసుల విషయంలో కువైత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసులను దేశం నుంచి బహిష్కరిస్తున్న కువైత్ వారు తిరిగి కింగ్డమ్లోకి ప్రవేశించకుండా బయో-మెట్రిక్ స్కానింగ్ చేస్తోంది. బహిష్కృతులందరినీ దేశం నుంచి వెళ్లగొట్టేముందు అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు ఈ పని పూర్తి చేస్తున్నారు.
దేశం నుండి బహిష్కరించబడిన ప్రవాసులు వేలిముద్రల వ్యవస్థ ను మార్చటానికి వారి చేతి వేళ్లకు శస్త్రచికిత్స చేసి తిరిగి దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా విమానాశ్రయంలో అరెస్టు చేయబడ్డారు. ఇలాంటి కొన్ని కేసులను ఇటీవల అంతర్గత మంత్రిత్వ శాఖ కనుగొంది. దాంతో అప్రమత్తమైన అధికారులు బయో-మెట్రిక్ స్కానింగ్ను తెరపైకి తెచ్చారు. ఈ ప్రక్రియ అటువంటి ప్రయత్నాన్ని నిరోధిస్తుందని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ వెల్లడించింది. దాంతో దేశం నుండి బహిష్కరించబడిన వారందరికీ వెంటనే బయో-మెట్రిక్ స్కాన్ తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించింది. తద్వారా వారి పునఃప్రవేశ ప్రయత్నం నిరోధించబడుతుంది.