గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. క్రమం తప్పకుండా వరుస తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో భాగంగా ఉల్లంఘనదారులను గుర్తించి వెంటనే దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన సుమారు 282 మంది ప్రవాసులు రెసిడెన్స్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించిన తనిఖీలలో పట్టుబడ్డారు. వీరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖైతాన్, హవాలీ, అల్ దజీజ్, కబ్ద్ బ్రాయేహ్ సలేం, సాల్హియా, మహబౌలా, ఫహహీల్ మార్కెట్స్, ఫర్వానియా తదితర ప్రాంతాలలో ఈ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల జనరల్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన కీలక విభాగాల ఈ తనిఖీలు అమలు చేయడం జరగుతోంది.














