ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్-కె చిత్రం నిర్మాణ దశ నుంచే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది. సూపర్హీరో కథాంశంతో హాలీవుడ్ స్థాయి సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నది. అమితాబ్బచ్చన్, కమల్హాసన్, దీపికా పడుకోన్, దిశా పటానీ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కాలిఫోర్నియాలో జరిగే శాండియాగో కామిక్ ఈవెంట్ – 2023లో లాంచ్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డులకెక్కబోతున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ప్రభాస్ పాత్రను క్యారికేచర్ రూపంలో చూపించారు. ప్రత్యేక శక్తులు కలిగిన సూపర్హీరోగా ఆయన లుక్ ఇంట్రెస్టింగ్గా ఉంది.

ఈ నెల 20న మొదలయ్యే శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్-కె టైటిల్తో పాటు చిత్ర ట్రైలర్, విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్అశ్విన్ మాట్లాడుతూ మన దేశం గొప్ప కథలకు, సూపర్హీరోలకు నిలయం. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది. కామిక్ కాన్ ఈవెంట్ ద్వారా మా చిత్రం ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతుంది అన్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు దక్కని గౌరవం దీనికి లభించనుంది. ఇక ఈ కార్యక్రమానికి ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్, అశ్వినీ దత్ హాజరుకానున్నారు.

