స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసనసభ్యురాలు గౌతు శిరీష, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విశ్వవిఖ్యాత అన్న ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పించి వేడుకలను ప్రారంభించారు.

ఫ్రాంక్ఫర్ట్లో నిర్వహించిన 34వ మహానాడు అనేక ప్రాధాన్యతలను సంతరించుకుంది. సినీ నటుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం మొదలై ఈ ఏడాదికి 75 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ వజ్రోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యురాలు గౌతు శిరీష మాట్లాడుతూ నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ ఎన్టీఆరే ఆద్యులని అన్నారు. కిలో రూ.2కే బియ్యం, పేదలకు పక్కా గృహాలు, జనతావస్త్రాల లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. జీవించిన కాలం ఎంతనే దాని కన్నా ఎలా జీవించామనేది ముఖ్యమని, ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రగతి కోసం తపిస్తూ ఎన్టీఆర్ అనేక పాలనా సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచారని కొనియాడారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ఫ్రాంక్ఫర్ట్ మినీ మహానాడుకు ఇంత భారీ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదని అన్నారు. యూరప్ దేశాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ అభిమానాలు, శ్రేణులు తరలి రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమన్నారు.

అనంతరం శ్రీకాంత్ కుడితిపూడి మాట్లాడుతూ అమెరికాకు ద్వారాలు మూసుకుపోవడంతో ఎక్కువ మంది జర్మన్ దేశం వైపు మొగ్గుచూపుతున్నారని, రాష్ట్రంలోనే జర్మన్ భాషను నేర్చుకుని రావడం వల్ల ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులువుగా లభిస్తాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు సుమంత్ కొర్రపాటి, కళ్యాణ్ సుంకు, రాజశేఖర్, ఫుడ్ కమిటీ సభ్యులు వంశీ ఉండవల్లి, దినేష్ కోవి, నరేంద్ర నాదెళ్ళ, మహేంద్ర కొండారెడ్డి, వెంకట్ ఖాండ్ర, నరేష్ కోనేరు, దినేష్ పాకలపాటి, హాస్పిటాలిటీ కమిటీ సభ్యులు : అనుదీప్ మేదరమెట్ల, ఫర్హత్ మిర్జా, సుజాత, సుచరిత, శివాని, అఖిల్, ప్రసన్న, కేదార్, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ సభ్యులు: విక్రమ్, నేహ, ఫైనాన్స్ కమిటీ సభ్యులు : పవన్ కుర్రా, శివ శంకర్ లింగం, వంశీ దాసరి, శ్రీనివాస్ ధామ, రామ్ బొల్లా, స్టేజ్ కమిటీ సభ్యులు: శివ బత్తుల, టిట్లు మద్దిపట్ల, డెకరేషన్ కమిటీ సభ్యులు : సురేంరద సునీత అనగా, పుడ్ సర్విగ్ కమిటీ సభ్యులు : మనోజ్ గుట్లపల్లి, కొండలరావు గుట్లపల్లి, కిషోర్ నల్లపాటి, హరి గుడ్ల, మారుతి, శశిధర్ అమ్మరెడ్డి పాల్గొన్నారు.
