బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ, అదుపులోనికి తీసుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో, కవిత ఇంట్లో సుమారు 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను అరెస్ట్ చేశారు.
వాస్తవానికి కవితను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని మధ్యాహ్నం నుంచే టాక్ నడుస్తూ వచ్చింది. కవిత ఇంట్లో అధికారుల సోదాలు, ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించడంతోనే ఇవాళ కీలక పరిణామమే జరుగుతుందని అందరూ ఊహించారు. దీనికి తోడు కవిత, ఆమె భర్త అనిల్, సహాయకుల ఫోన్లు మొత్తం 16 ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అయితే తనపై ఎలాంటి చర్యలు తీసుకోవ ద్దని సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మార్చి-19న విచారణ ఉండటంతో, అంతవరకూ ఎలాంటి పరిణా మాలు చోటుచేసుకోవని బీఆర్ఎస్ వర్గాలు ధీమాతోనే ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి ఏక కాలంలో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.