ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహ వెండితెరపై హీరోగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. మత్తు వదలరా, తెల్లవారితే చిత్రాల ఫేమ్ హీరో శ్రీసింహా కోడూరి తాజా చిత్రం ఉస్తాద్. ఫణిదీప్ దర్శకుడు. రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి క్లాప్ కొట్టారు. న్యూ ఏజ్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని చిత్రయూనిట్ తెలిపింది. హీరోయిన్తో పాటు ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో శ్రీవల్లి, సాయి కొర్రపాటి, కాల భైరవ, వెంకటేష్ మహా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పవన్ కుమార్ పప్పుల, సంగీతం : అకీవా. బి.














