అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా నాతి చరామి. ఈ చిత్రానికి నాగు గవర దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఏ స్టూడియో 24 ఫ్రేమ్ ప్రొడక్షన్స్ పతాకంపై జై.వైష్టవి కె నిర్మించారు. ఈ నెల 10న ఓటీటీ వేదికల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 1999, 2000 సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిది. శ్రీలత పాత్రలో పూనమ్ కౌర్ నటన ఆకట్టుకుంటుంది. నాటకీయతతో సాగే కథ ఆకర్షణ అవుతుంది అన్నారు. అరవింద్ ప్రభాకర్ అనే పాత్రలో ఒదిగిపోయారు అన్నారు. అరవింద్ కృష్ణ మాట్లాడుతూ కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసే పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన అవకాశం నాకు ఈ సినిమాతో వచ్చింది అన్నారు. పూనమ్ కౌర్ మాట్లాడుతూ దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న స్త్రీ పై కన్నేసిన ప్రతీ ఒక్కరూ రాక్షసులే. అలాంటి రాక్షసులపై పోరాటం చేసి ఎన్నో సవాళ్లని ఎదుర్కొన్న స్త్రీ మూర్తులు చాలామందే. అలాంటి సంఘటల్ని ప్రతిబింబించే కథ ఇదన్నారు. ఇందులో నేను చేసిన శ్రీలత పాత్ర అనేక భావోద్వేగాల చుట్టూ అల్లుకుని ఉంటుంది అన్నారు.














