ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని మెల్బ్ర్న్, సిడ్నీ నగరాలకు చెందిన ఎన్నారై టీడీపీ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మరమ్మతులు చేయించేందుకు కావాల్సిన డబ్బుల కోసం విరాళాలు సేకరించారు. పర్వతనేని దేవేంద్ర, కోడూరి శ్యాం ప్రసాద్, అన్నే రామకృష్ణ, యడ్లపల్లి ధరణేష్ తదితరుల చొరవతో విరాళాల రూపంలో సుమారు రూ.7 లక్షలను సేకరించారు. అంతేకాకుండా ఆ మొత్తాన్ని పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు.














