భారతదేశ ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు ఎన్ టీ రామారావుల స్ఫూర్తితో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.


హైదరాబాద్ అమీర్పేట్, మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ , ఇతర ప్రజాప్రతినిధులు సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. “దేశ చరిత్రను ఎవరు చదవాలన్నా, స్ఫూర్తి పొందాలన్నా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గారని, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు ఎన్టీఆర్ గారిని స్మరించుకోవాలి..” అంటూ ఆ మహానాయకులు అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ దేశం ఉన్నంత కాలం వారి కీర్తి ప్రతిష్టలు నిలబడుతాయన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు ఎన్టీఆర్ కులాలు, మతాలు, భాషలకు అతీతులు అన్నారు. ఈ దారిలో ప్రయాణించే వారిలో స్ఫూర్తిని నింపడానికి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. నాకు జీవితకాలం గుర్తుండిపోయే మధుర సంఘటన. తెలంగాణ నుంచి అనేక మంది నాయకులకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారు. ఇది ఎవరూ మరువలేని చరిత్ర” అని అన్నారు.


రాష్ట్రంలో 3.24 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. దానికి ఎన్టీఆర్ గారి 2 రూపాయలకే కిలోబియ్యం పథకం. ఎన్టీఆర్ అమలు చేసిన కూడు, గుడ్డ, నీడ నుంచి స్ఫూర్తితో అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. ఎన్టీఆర్ అమలు చేసిన జనతా వస్త్రాల పథకం స్ఫూర్తిగా ఆడబిడ్డలకు సారెగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నాం..” అని పలు పథకాలను ముఖ్యమంత్రి గారు ఉదహరించారు.

“ఇందిరమ్మ ఆశీర్వాదం, ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రజాపాలనలో ప్రతిఫలిస్తుంది. ఇందిరమ్మ ఎంత ముఖ్యమో.. ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. వారిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. వారి స్ఫూర్తితోనే అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నాం” అని పేర్కొన్నారు.





























