అమెరికాలోని షికాగోలో ఉన్న లెవీస్ యూనివర్సిటీలో తెలుగు తేజాలు సత్తా చాటారు. యూనివర్సిటీలో ఆధ్వర్యంలో నిర్వహించిన స్టార్టప్ ఐడియా పోటీల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆరుగురు ఫైనల్స్కు చేరుకోగా, వారిలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొణిజేడుకు చెందిన షమ్మి సాయిచరణ్, రామా చైతన్య, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన హష్మీ విజేతలుగా నిలిచారు.


ఈ సందర్భంగా ప్యానల్లోని న్యాయనిర్ణేతలు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది విద్యార్థుల ఆలోచనకు మద్దతు తెలిపారని చెప్పారు. విద్యార్థుల ప్రజెంటేషన్, కంటెంట్, ఐడియా చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. విజేతలకు 2 వేల డాలర్ల చెక్కు అందజేశారు. యూనివర్సిటీకి చెందిన పలువురు ప్రముఖులు మాట్లాడుతూ షమ్మి చరణ్, రామచైతన్య, హష్మీల కృషి, పట్టుదల భావితరాలకు ఎంతో ఆదర్శమని ప్రశంసించారు. తమ సహాయ సహకారాలు వారికి ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డును దక్కించుకున్న తెలుగు విద్యార్థులను పలువురు అభినందించారు.
