అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీసియెన్సీ నిర్వాహకులు, బిలియనీర్ మస్క్ పరిపాలన ప్రారంభ చర్యలను నిరసిస్తూ బుధవారం అమెరికా లోని ప్రధాన నగరాల్లో నిరసన ప్రదర్శనలు సాగాయి. వలసలపై కొత్తగా ఆంక్షలు, ట్రాన్స్జెండర్లను మహిళా క్రీడల నుంచి నిషేధించడం, గాజాను స్వాధీనం చేసుకోవాలని ప్రతిపాదించడం తదితర చర్యలను నిరసిస్తూ నిరసనలు హోరెత్తాయి. ఫిలడెల్ఫియా, కాలిఫోర్నియా,మిన్నెసొటా, మిచిగాన్, టెక్సాస్, విస్కాన్సిన్, ఇండియానా, తదితర రాష్ట్రాల రాజధానుల్లో నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమం ప్రాజెక్టు 2025పై విమర్శలు చేశారు. దాదాపు 50 రాష్ట్రాల్లో ఈ నిరసనలు సాగాయి.
మిచిగాన్లోని లాన్సింగ్లో, అనేక మంది నిరసనకారులు ఉష్ణోగ్రతలు కష్టమైనప్పటికీ గుమిగూడారు. కేటీ మిగ్లియెట్టి, మస్క్ ట్రెజరీ డిపార్ట్మెంట్ డేటా యాక్సెస్పై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్,తన కొత్త పదవీకాలం ప్రారంభంలో వాణిజ్యం, వలసలు, వాతావరణ మార్పు తదితర అంశాలపై కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యలపై డెమొక్రాట్లు వ్యతిరేక చర్యలు తీసుకోవడంతో నిరసనలు మరింత పెరిగాయి. టెక్సాస్, కాలిఫోర్నియా, డెన్వర్, ఫీనిక్స్, మిన్నెసోటా, ఐవా మరియు అలబామాలోనూ నిరసనల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నిరసనలు ట్రంప్ వ్యతిరేక పోరాటాన్ని మరింత ఘాటుగా మలిచాయి.
