ఇంటర్నెట్ ప్రపంచంలో గూగుల్ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలకాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలతో కూడిన 23 పేజీల డాక్యుమెంట్ను యూఎస్ న్యాయశాఖ తయారు చేసింది. వాషింగ్టన్ డీసీ కోర్టులో ఈ పత్రాన్ని దాఖలు చేసింది. గూగుల్ది ఏకఛత్రాధిపత్యం అని ఆగస్టులో వాషింగ్టన్ డీసీ కోర్టు న్యాయమూర్తి అమిత్ మెహతా పేర్కొన్నారు. దీంతో గూగుల్పై చర్యలు తీసుకోవాలని జో బైడెన్ ప్రభుత్వం భావిస్తున్నది. ఏప్రిల్లో ఈ కేసు విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో గూగుల్పై తీసుకోవాల్సిన చర్యలను కోర్టుకు ప్రతిపాదించింది.

గూగుల్కు చెందిన క్రోమ్ వెబ్ బ్రౌజర్ను విక్రయించేలా ఆదేశాలు ఇవ్వాలని, సొంత సెర్చ్ ఇంజిన్కు మేలు చేయకుండా ఆండ్రాయిడ్పై ఆంక్షలు విధించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. క్రోమ్ బ్రౌజర్ను విక్రయిస్తే కీలకమైన సెర్చ్ యాక్సెస్ పాయింట్పై గూగుల్ నియంత్రణ శాశ్వతంగా ఆగిపోతుందని, ప్రత్యర్థి సెర్చ్ ఇంజిన్లకు క్రోమ్లో స్థానం లభిస్తుందని న్యాయశాఖ లాయర్లు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ఈ కేసులో సెప్టెంబర్ 1న ‘లేబర్ డే’ లోపు న్యాయమూర్తి తీర్పు ఇవ్వనున్నారు.
