Namaste NRI

నాట్స్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు.. ఉపకారవేతనాలు

అమెరికా, కెనాడలో చదువుకునే తెలుగు విద్యార్ధులకు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ఉపకారవేతనాలు అందిస్తున్నారు. టాంపాలో జరిగిన నాట్స్ సంబరాల వేదికపై తెలుగు విద్యార్ధులకు 2025 సంవత్సరానికి సంబంధించిన ఉపకారవేతనాలు అందించారు. అమెరికా, కెనడాల్లో ఉన్నత విద్య చదువుకునే తెలుగు విద్యార్ధులకు నాట్స్ యూత్ స్కాలర్ షిప్స్ అందిస్తోంది.

గత మూడేళ్లగా నాట్స్ తెలుగు విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందిస్తోంది. ఈ స్కాలర్ షిప్‌ల ఎంపికకు విద్యార్థుల ప్రతిభ 50 శాతం, కుటుంబ ఆర్థిక పరిస్థితి 50 శాతం పరిగణనలోకి తీసుకుని చేస్తున్నారు.  2023లో బాపు నూతి నాట్స్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 9 వేల డాలర్లను తన సొంత నిధులతో విద్యార్థులకు ఉపకారవేతనాలుగా అందించారు. ప్రస్తుతం నాట్స్ యూత్ స్కాలర్‌షిప్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న బాపు నూతి ప్రతి ఏటా విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించడంలో ముందున్నారు.

2024 సంవత్సరంలో బాపు నూతి 5వేల డాలర్లు, శేఖరం కొత్త 3వేల డాలర్లు ఈ ఉపకారవేతనాల రూపంలో అందించారు. 2025లో బాపు నూతి 4వేల డాలర్లు, శేఖరం కొత్త 4వేల డాలర్లు విద్యార్థులకు అందజేశారు. కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికీ 1000 డాలర్ల చొప్పున ఇద్దరు విద్యార్థులకు, వైద్య విద్యను అభ్యసించే విద్యార్థి ఒక్కరికి 2000 డాలర్ల చొప్పున అందజేస్తున్నారు. మొత్తంగా ప్రతి ఏటా 8000 డాలర్ల నుండి 10,000 డాలర్ల వరకు అందజేస్తున్నారు.

నాట్స్ యూత్ స్కాలర్‌షిప్ ఎంపిక కమిటీలో నాట్స్ మాజీ అధ్యక్షులు మదన్ పాములపాటితో పాటు నాట్స్ నాయకులు డా.శేఖరం కొత్త, ధూళిపాళ్ల భానుప్రకాష్, తుమ్మలపెంట శ్రీనివాసరావు, శాకమూరి వెంకట, డా.యు.నరసింహారెడ్డి ఉన్నారు.

Social Share Spread Message

Latest News