రూపేష్, ఆకాంక్షాసింగ్ జంటగా, రాజేంద్రప్రసాద్, అర్చన మరో జంటగా రూపొందిన చిత్రం షష్టిపూర్తి. పవన్ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఇళయరాజా మాట్లాడారు. ఈ సినిమా కోసం నేనిచ్చిన ట్యూన్కి కీరవాణి పాట రాశారు. తను రాసిన పాట పల్లవి విన్నప్పుడు, తన మనసులో నాపై ఉన్న అభిమానాన్నీ, ఆత్మబంధాన్నీ క్రోడీకరించి రాశారనిపించింది. సంగీత దర్శకుడు కావడానికి ముందూ, అయిన తర్వాత కూడా నాపై ఆయనకున్న అభిమానం అలాగే ఉంది అన్నారు.

ఇంకా చెబుతూ ఈ సినిమాకు నేను చేసిన స్వరాలలో కొన్నింటిని మీరు విన్నారు. వినబోతున్నారు. వింటూనే ఉంటారు. ఇది నమ్మకంతో చెబుతున్నమాట. నేను చేసిన వేలాది పాటల్లో నాకు నచ్చినపాట ఏదని అడిగితే, ఒకటా రెండా? నాకు ఎంత సంగీతం తెలుసన్నది ఇక్కడ ముఖ్యంకాదు. సంగీతమే నా గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తుందో నాకే తెలీదు. ఎప్పటికీ తెలియకూడదని దేవుడ్ని కోరుకుంటున్నా. తెలిసిన మరుక్షణం నేను సంగీతాన్ని ఆపేస్తాను. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలి అని ఇళయరాజా పేర్కొన్నారు.
