హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తూ వస్తోంది. ఇక్కడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో వృద్ధి కన్పిస్తోంది. 2025లో హెచ్ఎండీఏలో దాదాపు 94, జీహెచ్ఎంసీలో 103 బహుళ భారీ భవంతులకు అనుమతులు వచ్చాయి. గతేడాదితో పోల్చితే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. హెచ్ఎండీఏలో అత్యధికంగా 91.16 లక్షల చదరపు మీటర్ల బిల్టప్ ఏరియాలో నిర్మాణాలు జరుగుతున్నాయి. 2024లో ఇది కేవలం 36.5 లక్షల చదరపు మీటర్లే కావడం గమనార్హం.

కోకాపేట నియోపోలిస్లో అత్యధికంగా 63 అంతస్తుల వరకు అపార్ట్మెంట్లు, ఇతర వాణిజ్య, వ్యాపార సముదాయాలు నిర్మాణం జోరుగా సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 2024లో కేవలం 69 భారీ భవంతులకు అనుమతులు ఇస్తే, 2025 ఏడాది నాటికి ఆ సంఖ్య 103ను దాటేసింది. ఇతర సాధారణ భవనాలకు సంబంధించి 2,381 అనుమతులను ఇచ్చారు. గతేడాదితో పోల్చితే ఈ పెరుగుదల స్వల్పంగా ఉంది. హెచ్ఎండీఏలో 2024లో కేవలం 55 బహుళ అంతస్తులకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. ఈసారి ఆ సంఖ్య 94 భారీ అంతస్తుల భవనాలకు చేరుకుంది. పై అంతస్తుల్లో ప్రశాంత వాతావరణం, కాలుష్యం ముప్పు తక్కువగా ఉంటుందనే భావనతో చాలా మంది నివసించేందుకు ఆసక్తి, ఇష్టం చూపుతున్నారు.

దేశంలో ముంబయి, దిల్లీ ఇతర మహా నగరాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) అమల్లో ఉంది. కానీ హైదరాబాద్లో మాత్రం నియంత్రణ లేకపోవడం భారీ భవంతుల నిర్మాణాలు పెరగడానికి ఓ కారణమని నిపుణులు తెలుపుతున్నారు. ఎఫ్ఎస్ఐ వల్ల భారీ భవనాల నిర్మాణంలో వెసులుబాటు తక్కువగా ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఎఫ్ఎస్ఐ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. భవనాల ఎత్తు, విస్తీర్ణంలో నిర్ణీత నిబంధనలకు లోబడి వీటిని చేపట్టాలి. కానీ హైదరాబాద్లో మాత్రం ఎఫ్ఎస్ఐ విషయంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో భారీ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి.

ఇటీవల ప్రభుత్వం బిల్డ్నౌ సాఫ్ట్వేర్ను తీసుకువచ్చింది. గత సాఫ్ట్వేర్లో దరఖాస్తులు అప్లోడ్, పరిశీలనలో తీవ్ర జాప్యం జరిగింది. వీటన్నింటిని గమనించి వాటిలో మార్పులు చేర్పులను ప్రభుత్వం చేసింది. ప్రస్తుతం నిమిషం వ్యవధిలోపే ప్లాన్లు, మ్యాప్లు అన్ని వివరాలు ఇందులో అప్లోడ్ అవుతున్నాయి. పరిశీలనలో కూడా వేగం పుంజుకుంది. దరఖాస్తు సమయంలో పూర్తి వివరాలు నమోదు చేస్తుండటం వల్ల తిరస్కరణ శాతం అనేది తగ్గుతోందని అధికారులు తెలుపుతున్నారు. దరఖాస్తుల తిరస్కరణ హెచ్ఎండీఏ పరిధిలో 2023లో 18 శాతం, 2024లో 20 శాతం ఉంటే 2025లో దాని వాటా తగ్గుతూ 15 శాతానికి పడిపోయింది.

హైదరాబాద్ సరికొత్త రూపును సంతరించుకుంటోంది. ఆకాశ హర్మ్యాలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికే గచ్చిబౌలి, నార్సింగి, కొండాపూర్ చుట్టుపక్కల్లో భారీ కట్టడాలు వెలుస్తున్నాయి. ఇప్పుడు వాటికి దీటుగా శంషాబాద్, ఉప్పల్, కిస్మత్పూర్, వనస్థలిపురం, అబిడ్స్, ఎల్బీనగర్, పోచారం, ఘట్కేసర్, గుడి మల్కాపూర్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లోనూ భారీ కట్టడాలు కడుతున్నారు. ఎత్తైన భవనాల్లో ముంబయి తర్వాత హైదరాబాద్లోనే ఎక్కువ సంఖ్యలో కడుతున్నారంటే హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.















