తుఫాన్ ప్రభావంతో ఆకలి బాధలు ఎదుర్కొంటున్న వలస కుటుంబాలకు మానవతా సహాయం అందించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ముందుకొచ్చింది. మచిలీపట్నం సమీపంలోని చిన్న కరగ్రహారం ప్రాంతంలో వలస కుటుంబాలకు తానా ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, మరియు కోశాధికారి రాజా కసుకుర్తి సహకారం అందించారు.


తుఫాన్ కారణంగా పిల్లలతో ఇళ్లలోనే చిక్కుకుపోయిన కుటుంబాలు ఆకలితో ఇబ్బందులు పడుతుండగా, తానా అందించిన భోజనం వారికి ఉపశమనంగా మారింది. “మేము ఎక్కడికీ వెళ్లలేకపోయాం… పిల్లలకి ఆహారం కూడా లేదు. తానా చేసిన సహాయం మాకు కొత్త ఆశను ఇచ్చింది,” అని బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశాయి.

ఈ సేవా కార్యక్రమాన్ని విజయవాడ హెల్పింగ్ హాండ్స్ సమన్వయపరచగా, తానా ప్రతినిధులు వారి సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఇబ్బందులు పడుతున్న వారికి మానవతా దృక్పథంతో సహాయం అందించడం తానా సంస్థ యొక్క స్థిరమైన సేవా స్ఫూర్తిని మరోసారి ప్రతిబింబించింది.
















