పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సిఎం సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ వరకు, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖు నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని సిఎం తెలిపారు.


