మెల్బోర్న్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ నాడు తెలంగాణలో జరిపిన అభివృద్ధి, రైతులకు మద్దతుగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి నిరోధక చర్యలు, ప్రజలను నిరాశకు గురిచేస్తున్న పాలన కొనసాగుతోంది. రైతులు, యువత, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజలు ఇప్పుడు కేసీఆర్ పాలన నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించనుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ పాత్ర అపారమైంది. రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఒక నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దారు. కానీ ప్రస్తుతం రాష్ట్రం తిరోగమన దిశలో పోతోంది. ప్రజలు దీనిని గమనిస్తున్నారు అని పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు ఉదయ్ సింహా రెడ్డి, సతీష్ పులిపాక, కత్తుల వినోద్, హర్ష, సాయికృష్ణ కల్వకుంట్ల, అశోక్ ఈగ, స్థానిక సంఘాల నాయకులు, తెలుగు ఎన్నారైలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
