
అద్దెకు తీసుకున్న ట్రక్కుతో 2023 మే 22న వైట్ హౌస్పై దాడి చేసేందుకు యత్నించిన తెలంగాణ యువకుడు సాయి వర్షిత్ కందుల(20)కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ అమెరికన్ కోర్టు తీర్పు చెప్పింది. ప్రజాస్వామికంగా ఎన్నికైన అమెరికన్ ప్రభుత్వాన్ని కూల్చి దానిస్థానంలో జర్మనీకి చెందిన నాజీ సిద్ధాంతంతో నియంతృత్వ పాలన తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ దాడి జరిగినట్టు అమెరికా న్యాయ శాఖ తెలిపింది. ఉద్దేశపూర్వకంగా గాయపరచడం లేదా అమెరికా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి తనపై వచ్చిన ఆరోపణలను 2024 మే 13న కందుల ఒప్పుకున్నట్టు న్యాయ శాఖ పేర్కొంది. జైలు శిక్ష పూర్తయ్యాక మరో మూడేళ్లు వర్షిత్ అధికారుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుందని జిల్లా జడ్జి ఆదేశించారు.
