ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత విపణిలోకి అడుగు పెట్టింది. ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని మేకర్ మ్యాక్సిటీ మాల్లో టెస్లా తన తొలి షోరూంను గ్రాండ్గా లాంఛ్ చేసింది. ఈ ఈవెంట్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టెస్లా తొలి షోరూం ముంబైలో ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. టెస్లా తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ను కూడా ప్లాన్ చేస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా ఫడణవీస్ తెలిపారు.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన వై మోడల్ కార్లను భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. భారత్లో ఆర్డబ్ల్యూడీ (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ కార్లను అమ్మకానికి ఉంచింది. రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది. వీటి ఆన్ రోడ్ ధరల్ని పరిశీలిస్తే ఆర్డబ్ల్యూడీ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలుకాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది.
















