భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.


మిథిలా స్టేడియంలో జరిగిన ఈ తిరుకల్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క , వాకిటి శ్రీహరి ఇతర ప్రజా ప్రతినిధులు, డీజీపీ బి.శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులతో పాటు అశేషంగా భక్తులు పాల్గొన్నారు.శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలిదశ రూ. 351 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు భూమిపూజ నిర్వహించారు. ఇందులో రూ. 180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, రూ. 96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, రూ. 75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.


















