
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి అనుమానాలు వచ్చినా దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. హమాస్తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఇటీవలే భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరిపై అమెరికా బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. అంతకుముందు మరో విద్యార్థిని రంజిని శ్రీనివాసన్ను కూడా బహిష్కరించింది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.

ఈ మేరకు అమెరికాలోని భారతీయ విద్యార్థులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. యూఎస్లోని భారతీయ విద్యార్థులు అక్కడ ప్రభుత్వ చట్టాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. ఎంబసీ, కాన్నులేట్ కార్యాలయాలు విద్యార్థులు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వీసాలు, వలస విధానాలపై నిర్ణయాలు పూర్తిగా ఆయా దేశాల విచక్షణాధికారానికి సంబంధించినవిగా పేర్కొంది. వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్పష్టం చేసింది.
