ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. యుద్ధం ముగింపు కోసం ఓ వైపు చర్చలు జరుగుతుండగానే రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ తమపై దాడికి రసాయన ఆయుధాలు తయారు చేస్తోందని రష్యా ఆరోపించగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. రసాయన ఆయుధాలు తయారు చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ఎప్పటికీ ఈ తరహా ఆయుధాలు తయారు చేసేదే లేదని తేల్చి చెప్పారు. రష్యా చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను ఇద్దరు పిల్లలకు తండ్రి అని, ఓ దేశానికి అధ్యక్షుడిని అని చెప్పుకొచ్చారు. తన భూమిపై రసాయన లేదా ఇతర సామూహిక విధ్వంసకర ఆయుధాల అభివృద్ధి చేయడం లేదన్నారు. తాను చెప్పేది నిజం అన్నారు.
ఈ విషయంలో అబద్దాలు చెప్పాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయం కూడా ప్రపంచం మొత్తానికి తెలుసు అన్నారు. రష్యాకు కూడా తెలుసని చెప్పుకొచ్చారు. లక్షలాది మంది దేశం విడిచి వెళ్లిపోయారని, రష్యా దాడులతో కీవ్తో పాటు మరియుపోల్ ప్రజలు ఆహారం, నీళ్లకు తల్లిడిల్లిపోతున్నారన్నారు. తమపైనే జీవాయుధాన్ని ప్రయోగించేందుకు రసాయనిక దాడి చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఒకవేళ తమపై రష్యా ఇలాంటి రసాయన దాడులకు పాల్పడితే గనుక ఆ దేశం మరిన్ని తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఉక్రెయిన్పై యుద్దానికి దిగిన రష్యా ఆ దేశంపై అనేక ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే.














