కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎన్నికల సంఘం రాజీ పడిందని ఆరోపించారు. అంతేకాదు, ఆ వ్యవస్థలో చాలా లోపాలున్నాయన్నారు. ఇందుకు ఇటీవలే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ బోస్టన్ లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈసీపై ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతదేశంలో ఎన్నికల సంఘం రాజీ పడింది. ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవలే మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘమే స్వయంగా ప్రకటించింది. అంత తక్కువ సమయంలో అంతమంది ఎలా ఓటు వేస్తారు. ఇది భౌతికంగా అసాధ్యం. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో మేము వీడియోలు చూపించాలని అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు అని రాహుల్ ఆరోపించారు.
