ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ హెలికాప్టర్పై అటాక్ ఏమీ జరగలేదని ఆ దేశ మీడియా ప్రకటించింది. హెలికాప్టర్ కూలిన వెంటనే దాంట్లో మంటలు వ్యాపించినట్లు మిలిటరీ విచారణాధికారులు పేర్కొన్నారు. సైనిక దళాలకు చెందిన జనరల్ స్టాఫ్ దీనిపై ప్రకటన రిలీజ్ చేశారు. అజర్బైజాన్ బోర్డర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో అధ్యక్షుడు రైసీతో పాటు మొత్తం ఆరు మంది మరణించారు. దాంట్లో విదేశాంగ మంత్రి కూడా ఉన్నారు. హెలికాప్టర్ కూలడాని ముందు కంట్రోల్ టవర్, హెలికాప్టర్ సిబ్బంది మధ్య జరిగిన సంభాషణల్లో ఎటువంటి అనుమానం వ్యక్తం కాలేదని మిలిటరీ జనరల్ పేర్కొన్నారు.

హెలికాప్టర్ కూలడానికి 90 సెకన్ల ముందు ఆ హెలికాప్టర్కు ఎస్కార్ట్గా వెళ్తున్న మరో రెండు హెలికాప్టర్ల మధ్య చివరి కమ్యూనికేషన్ జరిగినట్లు అధికారులు తేల్చారు. హెలికాప్టర్పై ఫైరింగ్ జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, ఆ హెలికాప్టర్ వెళ్తున్న మార్గంలో కూడా ఎటువంటి మార్పు లేదన్నారు. పూర్తిగా మంచు పట్టిన పర్వత శ్రేణుల్లో ఎగిరిన బెల్ కంపెనీ హెలికాప్టర్ పర్వతాలపై కూలింది. ఆదివారం ప్రమాదం జరగ్గా, సోమవారం ఆ ప్రాంతాన్ని గుర్తించారు. మాషాద్లో ఉన్న ఇమామ్ రీజా మసీదు వద్ద అధ్యక్షుడు రైసీ పార్దీవదేహాన్ని ఖననం చేశారు.
