కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా అథర్వ. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. మహేష్ రెడ్డి దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో ఈ సినిమా తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రింగా రింగా రోసే..పిల్లా నిన్ను చూసే అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ఈ పాటలో హీరో ప్రేయసికి తన ప్రేమ భావాలను చెప్పే ప్రయత్నం చేస్తాడు. శ్రీచరణ్ ఇచ్చిన ట్యూన్ ఆకట్టుకుంటుంది అన్నారు. హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ అనేక భావోద్వేగాలతో సాగే చిత్రమిది. ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా కథకు కావాల్సినవి నిర్మాత సమకూర్చారు. నా క్యారెక్టర్ ప్రేక్షకులకు చేరువవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక సిమ్రాన్, నటుడు గగన్, కొరియోగ్రాఫర్ భాను తదితరులు పాల్గొన్నారు.