రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెట్ ఆడే రెజ్లర్ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్గా ఈ సినిమా సెట్స్లో టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుగుతుండగా తిలక్ వర్మ అక్కడికి వెళ్లి రామ్ చరణ్ను కలిశారు. చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి కొంతసేపు సరదాగా గడిపిన తిలక్కు పెద్ది టీమ్ ఘన స్వాగతం పలికింది.

టీ20 వరల్డ్ కప్ గెలుపులో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ విజయానంతరం స్వరాష్ట్రానికి వచ్చిన తిలక్ను రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పెద్ది సినిమాలో ఉపయోగిస్తున్న క్రికెట్ బ్యాట్ను తిలక్ వర్మకు చూపిస్తూ మూవీ విశేషాలను చెర్రీ వివరించారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్కు రియల్ క్రికెటర్ రావడంతో చిత్ర యూనిట్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట్ సతీష్ కిలారు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.















