రష్యా చమురు కొనుగోలును కారణంగా చూపి భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్లు విధించిన విషయం తెలిసిందే. అమెరికా తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్పై యూఎస్ విధించిన టారిఫ్లపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను అడ్డుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్పై అధిక టారిఫ్లు విధించినట్లు చెప్పుకొచ్చారు.

జేడీ వాన్స్ మాట్లాడుతూ రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అధ్యక్షుడు ట్రంప్ కావాలనే భారత్పై అధిక టారిఫ్స్ విధించారు. ఆయిల్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆపాలనే లక్ష్యంతోనే ఈ చర్యలు. చమురు నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతే ఉక్రెయిన్పై దాడులు చేయడం మాస్కోకు కష్టతరమవుతుంది. దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంభించారు. భారత్పై సెకండరీ టారిఫ్స్ ఇందులో భాగమే. హత్యలను ఆపితే రష్యాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ఆహ్వానించొచ్చు. కానీ, దాడులు కొనసాగితే అది ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అని వాన్స్ తెలిపారు.
















