సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన మొగుల్ల మధు (35) ప్రయాణిస్తున్న డీసీఎంను మరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. 2009లో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన మధు 13 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. సౌదీ అరేబియాలో ఓ కంపెనీలో డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 3 నెలల క్రితం సౌదీ నుంచి సెలవులపై స్వదేశానికి వచ్చిన అతడు జూన్ 2వ తేదీన తిరిగి వెళ్లిపోయాడు. నాలుగు రోజు క్రితమే డ్యూటీ చేరారు. ఈ క్రమంలో మధు నడుపుతున్న డీసీఎంను మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని సౌదీలో ఉంటున్న మధు పెద్దన్న నర్సింహులు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. మధుకు భార్య లావణ్యతో పాటు కొడుకు అశ్విత్(10), కూతురు వేదశ్రీ(2), వృధ్దులైన తల్లిదండ్రులు బాలయ్య, లక్ష్మి ఉన్నారు. మధు మృతితో స్వస్థలం రాజక్కపేటలో విషాధం అలుముకుంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.














