భారత దేశంపై టారిఫ్ల దాడి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వూల్ఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ వైఖరి వల్ల అమెరికాకు ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు. బ్రిక్స్ వంటి ప్రత్యామ్నాయ ఆర్థిక మండళ్లు బలోపేతమవుతాయని జోస్యం చెప్పారు. చిన్న దేశాలపై ఒత్తిడి చేసినట్లుగా, భారత దేశంతో అమెరికా వ్యవహరించజాలదని స్పష్టం చేశారు. వూల్ఫ్ న్యూయార్క్లోని న్యూ స్కూల్లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్. అమెరికా భారత్ వంటి దేశంతో మాట్లాడటం కన్నా లెబనాన్ వంటి చిన్న మధ్య ప్రాచ్య దేశంతో మాట్లాడటం భిన్నంగా ఉంటుందని వూల్ఫ్ అన్నారు.

జనాభాను బట్టి భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్దదని, చైనాను అధిగమించిందని చెప్పారు. భారత దేశంపై తన టారిఫ్ల బెదిరింపులను కొనసాగిస్తే, ఆయన ఓ ప్రత్యేకమైన ప్రత్యర్థితో ఆడుకుంటున్నట్లేనని వివరించారు. అమెరికన్ మార్కెట్ను భారత ఎగుమతులకు మూసివేస్తే, భారత దేశం అభివృద్ధి చెందుతున్న ఇతర మార్కెట్లకు దగ్గర అవుతుందని వూల్ఫ్ చెప్పారు. పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా మరో మార్కెట్ను చూసుకున్నట్లుగానే, భారత దేశం కూడా తన ఎగుమతులను అమెరికాకు కాకుండా, బ్రిక్స్ దేశాలకు పంపిస్తుందన్నారు.















