ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకొంది. ఇకపై తమ దేశంలో వారానికి నాలుగున్నర రోజులే పనిదినాలని ప్రకటించింది. అంతేకాకుండా వారాంతాన్ని కూడా మునుపటి శుక్ర, శనివారాల నుంచి శని, ఆదివారాలకు మార్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం నుంచి వీకెండ్ ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, విభాగాలన్నీ ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
తాజా నిర్ణయంపై యూఏఈ ప్రభుత్వం స్పందిస్తూ శని, ఆదివారం సెలవుగా పాటించే దేశాలతో ఆర్థిక లావాదేవీలు సజావుగా జరిగేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నాము. ఈ నిర్ణయంతో దేశంలో పని చేసే వేలకొద్దీ అంతర్జాతీయ కంపెనీల లావాదేవీలు మరింత సరళంగా జరుగుతాయని అని పేర్కొంది. పని జీవితం మధ్య సమతౌల్యాన్ని ఈ నిర్ణయం మరింత పెంచుతుందని పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచంలో నాలుగున్నర రోజుల పని విధానాన్ని పాటిస్తున్న తొలి దేశం తమదేనని అక్కడి అధికారులు వ్యాఖ్యానించారు.














