క్షిపణి ప్రయోగాల విషయంలో ఉత్తర కొరియా ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అమెరికా గుడ్లురుముతున్నా ఖాతరు చేయకుండా మరోసారి రెండు బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ నెలలో ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించడం ఇది ఆరో సారి. ఉత్తర కొరియాలోని హామ్హంగ్ టౌన్ నుంచి ఈ ప్రయోగాలు జరిగాయని, 5 నిమిషాల వ్యవధిలో రెండు మిసైళ్లను వదిలారని తెలిపింది. తాజా క్షిపణులు 190 కిలోమీటర్లు ప్రయాణించి సముద్ర జలాల్లో పడ్డాయని దక్షిణ కొరియా సైనికాధికారి తెలిపారు.
ఈ ప్రయోగాల వల్ల జపాన్ తీరంలో నౌకలు, విమానాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని జపాన్ ప్రధాని ఫుమియా కిషిడ తెలిపారు. అమెరికాతో ఆగిపోయిన అణ్వస్త్ర దౌత్య చర్యలు మళ్లీ జరిగేలా, తమపై విధించిన ఆంక్షలను ఎత్తేసేలా ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో ఉత్తర కొరియా ఇలా ప్రయోగాలు చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.














