వెంకటగిరి రాజా వారి (వీఆర్) హైస్కూల్ను అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. నెల్లూరులో వీఆర్ మోడల్ పాఠశాలను లోకేశ్ ప్రారంభించారు. తరగతి గదులను, డిజిటల్ విద్యావిధానాన్ని, లైబ్రరీలో పుస్తకాలను లోకేశ్ పరిశీలించారు. ప్రతి తరగతి గదిలోని విద్యార్థులతో ముచ్చటించారు. క్రీడా మైదానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో క్రికెట్, వాలీబాల్ ఆటలు ఆడారు. ఈ సందర్భగా లోకేశ్ మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గాయకుడు ఎస్పీ బాలు వంటి వాళ్లు ఈ పాఠశాలలోనే చదివారని గుర్తు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటి వాళ్లు ఇదే పాఠశాల నుంచి వచ్చారన్నారు. మూతబడిన ఈ హైస్కూల్ను తిరిగి తెరిపించిన ఘనత మంత్రి నారాయణదే అన్నారు.


వ్యక్తిగతంగా తీసుకొని పాఠశాల ప్రారంభానికి నారాయణ తీవ్రంగా కృషి చేశారన్నారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు పాఠశాలలను తాను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. పట్టుదల, క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చన్నారు. సవాళ్లను స్వీకరించేందుకు అలవాటు పడాలని చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయా కసిగా పనిచేశా. ఐదేళ్లు కష్టపడ్డా దాని ఫలితమే ఎప్పుడూ రాని మెజారిటీతో గెలిచా. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు కష్టమైన శాఖ ఎందుకు తీసుకున్నారని చాలా మంది నన్ను అడిగారు. పవిత్రమైన బాధ్యతతో స్వీకరించిన పనిని ఇష్టంగా చేస్తున్నా. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా. యూనిఫామ్లు, మౌలిక సదుపాయాలతో పాటు అన్నింటిని మెరుగుపరిచాం. ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులకు మెరుగైన సాంకేతిక అందిస్తున్నాం అని తెలిపారు.




















