హీరో తేజ సజ్జా నటంచిన పాన్ ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బ్లాక్బస్టర్ థాంక్స్ మీట్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు. మా సంస్థకు గత ఏడాది అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో మిరాయ్ అపూర్వ విజయం మరెన్నో సినిమాలు చేసే శక్తినిచ్చింది. ఈ సినిమాతో మేము ప్రేక్షకుల విశ్వసనీయతను పొందాం. అది మాకు చాలా ఆనందాన్నిస్తున్నది అన్నారు. దర్శకుడు కార్తీక్ ఈ కథ చెప్పినప్పుడే మంచి కమిట్మెంట్ ఉన్న హీరో తేజతో ఈ సినిమా చేయాలనుకున్నాం. దర్శకుడు కార్తీక్, తేజ, మనోజ్, అందరూ అద్భుతమైన ఎఫర్ట్స్ పెట్టారు. మా అమ్మాయి కృతిప్రసాద్ ఈ సినిమాతో నిర్మాతగా మారారు. తను మాకు లక్కీ ఛార్మ్ అని భావిస్తున్నా అన్నారు.

మిరాయ్ చిత్రాన్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారని, దర్శకుడు కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్గారి ఎమోషనల్ సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చిందని హీరో తేజ సజ్జా తెలిపారు. 12 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సక్సెస్ వల్ల తన ఫోన్ మోగుతూనే ఉందని, ఈ కథలో తనను భాగం చేసిన దర్శకుడు కార్తీక్కు రుణపడి ఉంటానని, ఈ సినిమా తన కుటుంబాన్ని నిలబెట్టిందని మంచు మనోజ్ భావోద్వేగపూరితంగా మాట్లాడారు.
















