కూటమి ప్రభుత్వం వచ్చాక పేదల గృహ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తుందని 21 నెలల్లో 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వడమే దీనికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అర్హులైన వారందరికీ 2029 కల్లా ఇల్లు కట్టిఇస్తామని స్పష్టం చేశారు.


రాష్ట్ర వ్యాప్తంగా నేడు 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం జరిగింది. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడ్కో లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ముక్కర అంబిక అనే లబ్ధిదారు సొంతింటి వేడుకలో స్వయంగా పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మరో లబ్ధిదారు షేక్ నూరి కుటుంబ సభ్యులతో కలిసి వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించిన గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. నూరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు.


ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారధి, పీ నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే శ్రీమతి విజయశ్రీ, అధికారులు, నేతలు పాల్గొన్నారు.
















