భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యూకే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా లండన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. భారత్-యూకేల మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలూ సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరుదేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

భారత్-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించిన విషయం తెలిసిందే. 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందంలో పొందుపర్చారు. భారత్-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాలను ఇందులో ప్రతిపాదించారు.
















